అర్హులందరికీ ‘నేతన్న సేవలో’.. చేనేతలకు ఏటా రూ.25 వేల ఆర్థిక సాయం

ఈ నెల 7 నుంచి పథకం అమలు.. 5 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులకు గడువు

చీరాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు ప్రారంభం

చేనేతల గౌరవప్రదమైన జీవనమే ప్రభుత్వ లక్ష్యం : మంత్రి సవిత

అమరావతి, ఆగస్టు 3 (మీకోసం న్యూస్): రాష్ట్రంలోని అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ‘నేతన్న సేవలో’ పథకాన్ని ఈ నెల 7వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత ప్రకటించారు. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేతకు సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో చేనేత, జౌళి శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె కీలక ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి సవిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేందుకు సంక్షేమం, అభివృద్ధి రెండింటికీ సమాన ప్రాధాన్యం ఇస్తోందన్నారు. చేనేత వృత్తిని కొనసాగిస్తున్న కుటుంబాలకు స్థిరమైన ఆదాయం, ఆర్థిక భద్రత కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. చేనేత కార్మికులు గౌరవప్రదమైన జీవితం గడపాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని పేర్కొన్నారు.

హామీ ఇవ్వకున్నా అమలు చేస్తున్న పథకం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు, హామీ ఇవ్వని పథకాలను కూడా ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. అందులో భాగంగానే ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేతన్నల కుటుంబాల ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతి చేనేతకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

దరఖాస్తులకు 5 వరకు అవకాశం

ఈ నెల 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తామని మంత్రి తెలిపారు. అర్హులైన చేనేత కార్మికులు గడువులోపు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధికారులు గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి ప్రతి అర్హుడికి సమాచారం చేరేలా చూడాలని ఆదేశించారు. మీడియా ద్వారా కూడా అవగాహన కల్పించాలని సూచించారు.

దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా జరగాలని, అర్హులైన ఒక్క చేనేత కూడా లబ్ధికి దూరం కాకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. పథకం అమలులో విమర్శలకు, ఆరోపణలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

చేనేత సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబాటు

చేనేతల సంక్షేమం కోసం ఇప్పటికే పలు కీలక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని మంత్రి సవిత వివరించారు. 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న చేనేత కార్మికులకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అందిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు.

మగ్గం మీద నేసే చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, మర మగ్గం (పవర్ లూమ్) నేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామని వెల్లడించారు. అదనంగా త్రిఫ్ట్ ఫండ్ నిధులు, ముద్రా రుణాలు వంటి పథకాల ద్వారా కూడా చేనేతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

ప్రతి అర్హుడికి లబ్ధి చేరాలి

రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి నేతన్న సేవలో పథకం ప్రయోజనం అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని మంత్రి ఆదేశించారు. పథకం అమలులో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఈ పథకం చేనేత కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకంగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర చేనేత, జౌళి శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఆర్.పీ. సోసిడియా మాట్లాడుతూ, ఈ నెల 6వ తేదీ ఉదయానికి అన్ని జిల్లాల నుంచి లబ్ధిదారుల తుది జాబితా అందజేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాల వారీగా దరఖాస్తుల పరిశీలనను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

7న చీరాలలో జాతీయ చేనేత దినోత్సవం

ఈ నెల 7వ తేదీన చీరాలలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ‘నేతన్న సేవలో’ పథకాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారని తెలిపారు. అదే రోజు అర్హులైన చేనేతలకు ఆర్థిక సాయం అందించే ప్రక్రియకు శ్రీకారం చుడతారని పేర్కొన్నారు.

అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, చేనేత వస్త్రాల వినియోగాన్ని ప్రోత్సహించేలా ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, ప్లకార్డుల ప్రదర్శనలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజల్లో చేనేత వస్త్రాల వినియోగంపై చైతన్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

అధికారులకు స్పష్టమైన ఆదేశాలు

పథకం అమలులో పారదర్శకత, వేగం, అర్హత ప్రమాణాల పాటింపు అత్యంత ముఖ్యమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యం చేనేత కుటుంబాల సంక్షేమమేనని, అర్హులైన ప్రతి నేతన్నకు ఆర్థిక చేయూత అందేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగాన్ని బలోపేతం చేయడమే కాకుండా, నేతన్నల జీవనోపాధిని మరింత స్థిరపరిచే దిశగా చర్యలు కొనసాగిస్తోందని ఆమె స్పష్టం చేశారు.

ఈ సమీక్షా సమావేశంలో చేనేత, జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, రాష్ట్రంలోని అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, ఆప్కో అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘నేతన్న సేవలో’ పథకం చేనేత రంగానికి కొత్త ఊపునిచ్చే సంక్షేమ కార్యక్రమంగా నిలుస్తుందని అధికారులు అభిప్రాయపడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు