మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్ల నిధులు
మీకోసం న్యూస్, పెనుకొండ, ఆగస్టు 21:
పెనుకొండ మున్సిపాలిటీలోని ఎంపీడీవో కార్యాలయం వెనుక కాలనీ, వజ్రాలపేట కాలనీల్లో శుక్రవారం “ఇంటింటా తెలుగుదేశం–ఎన్డీఏ విజయాలు, అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొని కాలనీల్లో పర్యటించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, పెనుకొండ సమగ్ర అభివృద్ధే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పెంపు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి ఉచిత బస్సు ప్రయాణం, నేతన్న సేవలో, ఆటో డ్రైవర్ల సేవలో తదితర సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.15 కోట్లు
పెనుకొండ మున్సిపాలిటీ అభివృద్ధికి రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల కల్పన కోసం రూ.15 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు మంత్రి తెలిపారు. స్థానిక ఎన్డీఏ కూటమి, టీడీపీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి చేయాల్సిన రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నిర్మించాల్సిన రోడ్లు, చేపట్టాల్సిన డ్రైనేజీ పనులపై అధికారులు, స్థానిక నాయకులతో చర్చించి పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పాత మార్కెట్ పునర్నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
పెనుకొండ పట్టణంలోని పాత మార్కెట్ను మంత్రి సవితమ్మ పరిశీలించారు. ప్రజలు, వ్యాపారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా మార్కెట్ను పునర్నిర్మించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మున్సిపల్ కమిషనర్, అధికారులు, స్థానిక నాయకులతో చర్చించారు.
పెనుకొండ పట్టణ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలిపారు. మంజూరైన నిధులతో రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతుల పనులను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వార్డు నాయకులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు, కాలనీ ప్రజలు పాల్గొన్నారు.
0 కామెంట్లు