మీకోసం న్యూస్, పెనుకొండ, ఆగస్టు 20: భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రీమియం SUV విభాగంలో మరో కొత్త వాహనం సందడి చేయనుంది. Kia India తన ఫ్లాగ్షిప్ SUV కియా సోరెంటోకు సంబంధించిన తొలి అధికారిక చిత్రాలను గురువారం విడుదల చేసింది. భారత మార్కెట్ కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, దేశంలోనే తయారు చేస్తున్న సోరెంటో ఉత్పత్తి అనంతపురం జిల్లాలోని కియా ప్లాంట్లో ప్రారంభమైంది. తొలి స్థానికంగా తయారైన సోరెంటో ఉత్పత్తి లైన్ నుంచి బయటకు వచ్చింది.
కియా సోరెంటోను సెప్టెంబర్ 4, 2026న భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే కియా ఇండియా డీలర్షిప్లు, అధికారిక వెబ్సైట్ ద్వారా ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.
తొలి హైబ్రిడ్ SUVగా ప్రత్యేకత
భారత్లో కియా అందించనున్న తొలి హైబ్రిడ్ SUVగా సోరెంటో ప్రత్యేకతను సంతరించుకోనుంది. అంతేకాకుండా ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వ్యవస్థతో హైబ్రిడ్ పవర్ట్రెయిన్ను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రీమియం మూడు వరుసల సీట్ల SUVగా మార్కెట్లోకి రానున్న సోరెంటో.. పెద్ద కుటుంబాలు, సుదూర ప్రయాణాలు చేసే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లు కియా పేర్కొంది.
హైబ్రిడ్ వాహనాలతో పాటు సంప్రదాయ డీజిల్ పవర్ట్రెయిన్ ఎంపికను కూడా అందించనున్నారు. దీంతో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా హైబ్రిడ్, డీజిల్ మోడళ్లలో తమకు నచ్చిన వాహనాన్ని ఎంచుకునే అవకాశం లభించనుంది. భారత మార్కెట్లో మారుతున్న వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ పవర్ట్రెయిన్ ఎంపికలను అందించడంలో భాగంగానే సోరెంటోను తీసుకొస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
అనంతపురం ప్లాంట్లో తయారీ
సోరెంటో భారత మార్కెట్లోకి ప్రవేశించకముందే అనంతపురం ప్లాంట్లో ఉత్పత్తి ప్రారంభించడం కీలక పరిణామంగా కియా అభివర్ణించింది. ‘‘భారత్ కోసం.. భారత్లోనే తయారీ’’ అనే విధానంలో భాగంగా స్థానిక ఉత్పత్తికి ప్రాధాన్యం ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది.
భారతీయ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తయారు చేస్తున్న సోరెంటోతో దేశంలో కియా ప్రీమియం SUVల పోర్ట్ఫోలియో మరింత విస్తరించనుంది. గంభీరమైన డిజైన్, ప్రత్యేకమైన బాహ్య రూపం, అధునాతన ఇంటీరియర్ వంటి అంశాలు సోరెంటోలో ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి.
AI సాంకేతికతకు పెద్దపీట
సోరెంటోలో అత్యాధునిక సాంకేతికతకు కియా ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో Live Generative AI సామర్థ్యాలతో కూడిన Kia AI Assistantను అందించనున్నారు. భారతదేశంలో విడుదల కానున్న సోరెంటోలో ఈ సాంకేతికతను ప్రపంచంలోనే తొలిసారిగా పరిచయం చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.
సాధారణ వాయిస్ అసిస్టెంట్లకు భిన్నంగా Live Generative AI సహజమైన సంభాషణకు అనుగుణంగా స్పందించడంతో పాటు, రియల్టైమ్ సమాచారాన్ని అందించేలా రూపొందించినట్లు కియా వివరించింది. దీంతో డ్రైవింగ్ సమయంలో వినియోగదారులకు మరింత వ్యక్తిగతీకరించిన, సమాచారంతో కూడిన అనుభవం లభించనుంది.
ప్రీమియం SUV విభాగంలో కొత్త అధ్యాయం
సోరెంటో ఆవిష్కరణ, ఉత్పత్తి ప్రారంభం సందర్భంగా కియా ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, CEO గ్వాంగ్గు లీ మాట్లాడుతూ.. సోరెంటో భారత మార్కెట్లోకి రావడం తమ ప్రీమియం ఉత్పత్తుల పోర్ట్ఫోలియోలో కీలక ఘట్టమని అన్నారు. అనంతపురం ప్లాంట్లో స్థానికంగా తయారైన తొలి సోరెంటో ఉత్పత్తి లైన్ నుంచి బయటకు రావడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందిన ఈ ఫ్లాగ్షిప్ SUVని భారతీయ వినియోగదారులకు చేరువ చేస్తున్నామని తెలిపారు.
హైబ్రిడ్, డీజిల్ పవర్ట్రెయిన్ ఎంపికలతో వినియోగదారులకు మరింత వైవిధ్యాన్ని అందించనున్నామని ఆయన పేర్కొన్నారు. భారత్లో తొలిసారిగా పరిచయం చేస్తున్న Live Generative AI సాంకేతికత కియా సంస్థతో పాటు భారత ఆటోమొబైల్ రంగానికి కూడా ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు.
సెప్టెంబర్ 4న సోరెంటో అధికారికంగా భారత మార్కెట్లోకి రానుండటంతో ప్రీమియం మూడు వరుసల SUV విభాగంలో పోటీ మరింత ఆసక్తికరంగా మారనుంది. అనంతపురంలో తయారైన తొలి సోరెంటోతో స్థానిక తయారీకి కూడా కియా మరింత ప్రాధాన్యం ఇచ్చినట్లయింది.
0 కామెంట్లు