కుటుంబాలను నిలబెట్టడమే ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ లక్ష్యం

మస్యలను సామరస్యంగా పరిష్కరించడంలో ధర్మవరం కౌన్సిలింగ్‌ సెంటర్‌ ముందంజ

ధర్మవరం, ఆగస్టు 08 (మీకోసం న్యూస్ ): భార్యాభర్తల మధ్య తలెత్తే చిన్నచిన్న మనస్పర్థలు, కుటుంబ సమస్యలను కౌన్సిలింగ్‌ ద్వారా పరిష్కరించి కుటుంబాలను తిరిగి కలపడమే పోలీస్‌ ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ కేంద్రం ప్రధాన లక్ష్యమని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. ధర్మవరం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నిర్వహిస్తున్న పోలీస్‌ ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. కేంద్రం నిర్వహణ, ఇప్పటివరకు అందించిన సేవలపై సభ్యులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కౌన్సిలింగ్‌ కేంద్రం సభ్యులు కేంద్రం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఎస్పీకి వివరించారు. 2026 జనవరిలో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు మొత్తం 50 మంది భార్యాభర్తల జంటలకు కౌన్సిలింగ్‌ నిర్వహించినట్లు తెలిపారు. వీరిలో 39 జంటల మధ్య నెలకొన్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించి, వారిని తిరిగి కలిపినట్లు వెల్లడించారు. వారంలో శనివారం మినహా మిగిలిన రోజుల్లో కౌన్సిలింగ్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

కౌన్సిలింగ్‌ కేంద్రం పనితీరుపై ఎస్పీ సతీష్‌ కుమార్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ధర్మవరం పోలీస్‌ ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ కేంద్రం ముందంజలో ఉండటం అభినందనీయమన్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడే సమస్యలను తొలిదశలోనే గుర్తించి, ఇరువర్గాల అభిప్రాయాలను తెలుసుకుని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు సభ్యులు చేస్తున్న కృషిని ప్రశంసించారు.

కుటుంబ సమస్యలు పోలీస్‌ స్టేషన్‌ వరకు వచ్చిన సందర్భాల్లో వాటిని కేవలం కేసుల కోణంలో కాకుండా, సాధ్యమైన మేరకు కౌన్సిలింగ్‌ ద్వారా పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడం ద్వారా కుటుంబ బంధాలను కాపాడేందుకు అవకాశం ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు. భార్యాభర్తలు పరస్పరం ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించుకోవాలని, చిన్నచిన్న అపార్థాలు పెద్ద సమస్యలకు దారితీయకుండా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు.

ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ కేంద్రానికి అవసరమైన వసతులు కల్పించడంతో పాటు, సభ్యులకు అవసరమైన సలహాలు, సూచనలు పోలీస్‌ శాఖ తరఫున అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. సేవాభావంతో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తూ కుటుంబాలను తిరిగి కలపడంలో సభ్యులు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

అనంతరం కౌన్సిలింగ్‌ కేంద్రానికి వచ్చిన కొత్తపల్లి మండలానికి చెందిన భార్యాభర్తలతో ఎస్పీ స్వయంగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, ఇరువర్గాల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. కుటుంబ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు పరస్పర సహకారం అవసరమని సూచించారు.

శ్రీ సత్యసాయి జిల్లా పరిధిలోని 10 పోలీస్‌ స్టేషన్లలో ఫ్యామిలీ కౌన్సిలింగ్‌ కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ సతీష్‌ కుమార్‌ తెలిపారు. కుటుంబాల్లో తలెత్తే సమస్యలను కౌన్సిలింగ్‌ ద్వారా పరిష్కరించి, సాధ్యమైన మేరకు కుటుంబాలను నిలబెట్టడం అభినందనీయమైన సేవగా పేర్కొన్నారు. ఈ సేవలను మరింత సమర్థవంతంగా కొనసాగించాలని కౌన్సిలింగ్‌ సభ్యులకు సూచించారు.

కార్యక్రమంలో ధర్మవరం డీఎస్పీ బీవీ జగన్నాథరాజు, వన్‌టౌన్‌ సీఐ రెడ్డప్ప, కౌన్సిలింగ్‌ సభ్యులు చలపతి, బాలసుందరి, గంగాభవాని, రాఘవ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు