పెట్టుబడులు కూడా దక్కని పరిస్థితి.. పంటను పొలాల్లోనే వదిలేస్తున్న అన్నదాతలు
దిగుబడి పెరిగినా ధరలు పడిపోవడంతో ఆందోళన
మీకోసం న్యూస్, అనంతపురం ఆగస్ట్ 23 : టమోటా రైతులకు ఈ సీజన్ ప్రారంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట చేతికి వచ్చిన సమయంలో ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో టమోటా ధరలు గరిష్టంగా కిలో రూ.10 నుంచి రూ.12 మధ్య మాత్రమే పలుకుతున్నాయి. దీంతో పంట సాగు కోసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు.
సాధారణంగా సీజన్ ప్రారంభంలో టమోటాకు మంచి ధర లభిస్తుందనే ఆశతో రైతులు ముందుగానే సాగు చేపడుతుంటారు. గత ఏడాది ఇదే సమయంలో కిలో టమోటా రూ.30 నుంచి రూ.40 వరకు పలికింది. 15 కిలోల బాక్సుకు రూ.450 నుంచి రూ.600 వరకు ధర లభించింది. దీంతో ఈసారి కూడా మంచి ధర వస్తుందనే నమ్మకంతో పలువురు రైతులు ముందస్తుగా పంట సాగు చేశారు. అయితే ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది.
భారీగా మార్కెట్కు దిగుబడి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొన్నేళ్లుగా టమోటా సాగు విస్తీర్ణం పెరుగుతోంది. కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం, కళ్యాణదుర్గం తదితర మండలాల్లో రైతులు పెద్ద ఎత్తున టమోటా సాగు చేశారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 23 వేల హెక్టార్లలో టమోటా సాగులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో కొంతభాగం ఇప్పటికే కోత దశకు చేరుకుంది.
దిగుబడి ఆశాజనకంగా ఉండటంతో పెద్ద మొత్తంలో టమోటా కాయలు మార్కెట్లకు తరలివస్తున్నాయి. అనంతపురంలోని కక్కలపల్లి ప్రైవేట్ మార్కెట్కు రోజుకు వేల టన్నుల టమోటా వస్తున్నట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కళ్యాణదుర్గం మార్కెట్కు కూడా భారీగా దిగుబడి చేరుతోంది. ఇతర ప్రాంతాల్లోని మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఎగుమతులు తగ్గడంతో ధరలపై ప్రభావం
మార్కెట్కు టమోటా సరఫరా పెరగడం, మరోవైపు ఎగుమతులు మందగించడం ధరల పతనానికి ప్రధాన కారణాలుగా వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్కు పెద్ద మొత్తంలో పంట వస్తున్నప్పటికీ, ఆ స్థాయిలో డిమాండ్ లేకపోవడంతో ధరలు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు.
ధరలు కనీస స్థాయికి పడిపోవడంతో రైతులకు రవాణా ఖర్చులు, కూలీల ఖర్చులు కూడా భారం అవుతున్నాయి. మార్కెట్కు పంటను తీసుకెళ్లేందుకు అయ్యే ఖర్చు కూడా రాకపోవడంతో కొందరు రైతులు టమోటాలను తోటల్లోనే వదిలేస్తున్నారు. మరికొందరు పంటను రోడ్ల పక్కన లేదా ఖాళీ ప్రదేశాల్లో పారబోస్తున్నారు.
ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి
టమోటా సాగుకు ఎకరాకు సుమారు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. కట్టెలపై సాగు చేసే రైతులకు అదనంగా మరింత వ్యయం అవుతోంది. మొక్కల కొనుగోలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చు, నీటి నిర్వహణ, రవాణా వంటి వాటికి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించాల్సి వస్తోంది.
ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధరలతో ఈ ఖర్చులో కనీసం సగం కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంటను కోసి మార్కెట్కు తీసుకెళ్లినా ఆశించిన ధర రాకపోవడంతో కొందరు రైతులు కోత కూడా చేయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు.
బాక్సుకు రూ.250 వస్తేనే కొంత ఊరట
కనగానపల్లి మండలం వేపకుంటకు చెందిన రైతు చిన్న వీరనారాయణ రెండు ఎకరాల్లో టమోటా సాగు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పలు విడతల్లో కోత చేపట్టామని, మార్కెట్లో బాక్సుకు తక్కువ ధర మాత్రమే లభిస్తోందని చెప్పారు. సీజన్ ప్రారంభంలో మంచి ధర వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే పంట సాగు చేశానని, ప్రస్తుతం వస్తున్న ధరలతో పెట్టుబడులు తిరిగి రావడం కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం బాక్సుకు రూ.250కుపైగా ధర లభిస్తేనే కొంత మేర గిట్టుబాటు అవుతుందని పేర్కొన్నారు.
కళ్యాణదుర్గం మండలం పీటీఆర్ పల్లికి చెందిన మరో రైతు కూడా ఇదే పరిస్థితిని వివరించారు. మూడు ఎకరాల్లో టమోటా సాగు చేసి ఎకరాకు రూ.లక్షకుపైగా పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. గతంలో ఈ సమయంలో మంచి ధరలు రావడంతో ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందని భావించామని, కానీ ధరలు అనూహ్యంగా పడిపోయాయని చెప్పారు. కనీసం బాక్సుకు రూ.300 వరకు ధర వస్తేనే పెట్టుబడులు పోను కొంత లాభం మిగిలే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కంబదూరు మండలం ఒంటారెడ్డిపల్లికి చెందిన నరేష్ అనే రైతు మూడు ఎకరాల్లో టమోటా సాగు చేసినట్లు తెలిపారు. సుమారు రూ.3 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని, ప్రస్తుతం ధరలు భారీగా తగ్గిపోవడంతో కనీసం పెట్టిన డబ్బు తిరిగి వస్తుందో లేదోనని ఆందోళన వ్యక్తం చేశారు. టమోటా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపులు
టమోటా ధరలు పడిపోవడంతో రైతులు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు. మార్కెట్ ధరలను స్థిరీకరించేందుకు చర్యలు తీసుకోవాలని, రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు. పంటకు కనీస ధర లభించేలా మార్కెట్ జోక్యం, కొనుగోలు వ్యవస్థను బలోపేతం చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.
దిగుబడి బాగున్నా ధర లేకపోవడం వల్ల నష్టపోతున్న టమోటా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటేనే వారికి కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. లేకపోతే ప్రస్తుతం కొనసాగుతున్న ధరల పతనం రైతులపై మరింత ఆర్థిక భారాన్ని మోపే పరిస్థితి కనిపిస్తోంది.
0 కామెంట్లు