మీకోసం న్యూస్ | పెనుకొండ| ఆగస్ట్ 14:
కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 18న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు తెలిపారు. ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా పెనుకొండ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ఆందోళనకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం విడుదల చేశారు. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, వివిధ రంగాల సిబ్బంది పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఆంజనేయులు మాట్లాడుతూ ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు, మున్సిపల్ కార్మికులు, విద్యుత్ కార్మికులు, ఏపీఎస్ఆర్టీసీ ఔట్సోర్సింగ్ కార్మికులు, వీఆర్ఏలు, సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు తదితరులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు గడుస్తున్నా కార్మికులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.
రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలి
కార్మికులకు నెలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరారు. ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలని, కార్మికుల హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు.
నరేంద్ర మోదీ, చంద్రబాబు ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటాలను ఉధృతం చేస్తామని ఆంజనేయులు తెలిపారు. ఈ నెల 18న జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించే ఆందోళనను విజయవంతం చేసేందుకు కార్మికులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బండి ఆనంద్రాజు, జిల్లా కోశాధికారి బాబు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు మల్లికార్జున, మున్సిపల్ ఇంజినీరింగ్ జిల్లా నాయకులు గంగాధర్, పెనుకొండ మున్సిపాలిటీ నాయకులు మహేష్, నర్సింహులు తదితర కార్మికులు పాల్గొన్నారు.
0 కామెంట్లు