ఈ నెలలో రెండుసార్లు స్వామివారి గరుడ వాహన సేవ

ఆగస్టు 17న గరుడ పంచమి – 28న శ్రావణ పౌర్ణమి

మీకోసం న్యూస్,తిరుమల, ఆగస్టు 16: తిరుమలలో ఈ నెలలో రెండుసార్లు శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆగస్టు 17న గరుడ పంచమి సందర్భంగా, ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.

ఆగస్టు 17న సోమవారం గరుడ పంచమి పర్వదినం సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు శ్రీ మలయప్పస్వామివారు తనకు ఇష్టవాహనమైన గరుడునిపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించనున్నారు.

ప్రతి ఏడాది తిరుమలలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని, స్త్రీలు తమకు కలిగే సంతానం గరుడునిలా బలశాలిగా, మంచి వ్యక్తిత్వంతో ఎదగాలని ఆకాంక్షిస్తూ గరుడ పంచమి పూజలు నిర్వహిస్తారని ఆధ్యాత్మిక విశ్వాసం.

ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి గరుడ సేవ

తిరుమలలో ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి సందర్భంగా టీటీడీ గరుడ సేవను ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు గరుడ వాహనంపై రాత్రి 7 గంటల నుంచి 9 గంటల మధ్య తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఈ రెండు ప్రత్యేక గరుడ వాహన సేవలను పురస్కరించుకుని తిరుమలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కానున్నారు.

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు