తుంగభద్ర నీటి విడుదలపై మంత్రి నిమ్మల రామానాయుడితో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ సమావేశం
అనంతపురం రైతుల సాగునీటి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
మీకోసం న్యూస్,అనంతపురం ఆగష్టు 18: తాగునీటితో పాటు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాగునీటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ కోరారు. తుంగభద్ర నీటి విడుదలపై విజయవాడలోని జలవనరుల శాఖ మంత్రి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం కీలక సమావేశం జరిగింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అనంతపురం నియోజకవర్గ రైతుల సాగునీటి అవసరాలను ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తుంగభద్ర నీటి విడుదలలో రైతులకు ఇబ్బందులు కలగకుండా తగిన స్థాయిలో నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రైతుల సాగునీటి అవసరాలను ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
అదేవిధంగా అనంతపురం నగర ప్రజల తాగునీటి అవసరాలను కూడా ఎమ్మెల్యే ప్రస్తావించారు. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా తాగునీటి కొరత ఏర్పడకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
సమావేశం అనంతరం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ రైతులు, ప్రజల ప్రయోజనాల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదన్నారు. తుంగభద్ర నీటి విడుదల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
0 కామెంట్లు