పెనుకొండలో ఘనంగా "ఇంటింటా ఎన్డీయే కూటమి విజయాలు" కార్యక్రమం

మారుతి నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం – ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించిన నాయకులు

పెనుకొండ, ఆగస్టు 2 (మీకోసం న్యూస్): పెనుకొండ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు మారుతి నగర్ కాలనీలో ఆదివారం "ఇంటింటా ఎన్డీయే కూటమి విజయాలు" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ప్రజలతో నేరుగా మాట్లాడి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమానికి ఉప్పర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి రమణ, వీరశైవ లింగాయత్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ స్వప్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. స్థానిక ఎన్డీయే కూటమి నాయకులతో కలిసి కాలనీలోని ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

 ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు చేరువవుతున్నాయని వారు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు వేలాది కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తున్నాయని తెలిపారు. అలాగే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా తల్లిదండ్రులకు చేయూత అందుతోందని, రైతుల అభ్యున్నతికి అన్నదాత సుఖీభవ వంటి కార్యక్రమాలు రైతాంగానికి అండగా నిలుస్తున్నాయని వివరించారు.

ఇళ్లలో గృహిణులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత దీపం పథకం కూడా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని నాయకులు వెల్లడించారు.

పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే సవితమ్మ ప్రత్యేక దృష్టి సారించారని నాయకులు తెలిపారు. ఆమె కృషి వల్ల పెనుకొండలో పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని పేర్కొన్నారు.

అందులో భాగంగా రూ.100 కోట్ల వ్యయంతో అమృత్ పథకం కింద పట్టణ ప్రజలకు ఇంటింటికీ స్వచ్ఛమైన ఫిల్టర్ తాగునీటిని అందించే పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి తాగునీటి సరఫరా కోసం 0.18 టీఎంసీల నీటి విడుదలకు ప్రత్యేక జీవో జారీ కావడం ద్వారా భవిష్యత్తులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని వివరించారు.

యువతకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు కియా సంస్థ సహకారంతో సుమారు రూ.12 కోట్ల వ్యయంతో ఐటీఐ కళాశాల ఏర్పాటు జరుగుతోందని తెలిపారు. అదే విధంగా పేద విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ఎంజేపీ బాలుర గురుకుల పాఠశాల ప్రారంభించడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు.

సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో అర్హులైన ప్రతి కుటుంబానికి గృహ నిర్మాణం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మౌలిక వసతుల అభివృద్ధి, తాగునీరు, విద్య, ఉపాధి, గృహ నిర్మాణం వంటి అన్ని రంగాల్లో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందన్నారు. యువనేత, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మార్గదర్శకత్వంలో విద్య, ఉపాధి రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నారని తెలిపారు. మంత్రి సవితమ్మ సమర్థ నాయకత్వంతో పెనుకొండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని నాయకులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజలకు పూర్తి వివరాలు అందించడంతో పాటు వారి సమస్యలు, సూచనలను కూడా తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
కార్యక్రమంలో జరిగిన ప్రతి అంశాన్ని, ఫొటోలను పార్టీ నాయకులు మై టీడీపీ యాప్ ద్వారా అప్‌లోడ్ చేసి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించారు. ఈ ప్రచార కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, యువకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు.

ఈ కార్యక్రమంలో నాగులూరు నారాయణస్వామి, పట్టణ కన్వీనర్ శ్రీరాములు, మహిళా అధ్యక్షురాలు రమణమ్మ, చంద్రకాంతమ్మ, బాబుల్ రెడ్డి, హూజూర్, షమీ, లక్ష్మీదేవమ్మ, నియోజకవర్గ మహిళా నాయకురాళ్లు అనసూయమ్మ, బేబీ, వెంకటలక్ష్మి, లక్ష్మీ, సువర్ణ, రత్నమ్మ, కడ్డీలు రవి, బోయ సోము, వగ్గప్పగారి హరి, శ్రీకాంత్, గోపీకృష్ణతో పాటు పలువురు ముఖ్య నాయకులు, మహిళా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు