ఏలూరు జిల్లా ముసునూరులో నిర్వహించిన నాన్-జీఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తన ఆవిష్కరణ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ముసునూరును వ్యవసాయ రంగంలో విజయగాథగా తీర్చిదిద్దుతున్నందుకు ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించారు.
రైతులే దేశానికి వెన్నెముక
దేశ ఆర్థిక ప్రగతిలో రైతుల పాత్ర ఎంతో కీలకమని సీపీ రాధాకృష్ణన్ అన్నారు. జీడీపీ, అభివృద్ధి వంటి అంశాల గురించి చర్చించకముందే తరతరాలుగా దేశానికి అన్నం అందిస్తున్నది రైతులేనని చెప్పారు. భారతీయ సంస్కృతి, పండుగలు, వ్యవసాయంతో విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయని వివరించారు.
విత్తనం వేయడం నుంచి పంట కోత వరకు కొనసాగే వ్యవసాయ చక్రం ఆధారంగానే మన పండుగలు, కాలగమనానికి సంబంధించిన సంప్రదాయాలు రూపుదిద్దుకున్నాయని తెలిపారు. సంక్రాంతి, లోహ్రీ, పొంగల్, బిహు వంటి పంటల పండుగలు దేశంలోని విభిన్న ప్రాంతాలను వ్యవసాయం ద్వారా ఒక్కటిగా కలుపుతున్నాయని పేర్కొన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం, అనుబంధ రంగాలు దేశ స్థూల విలువ జోడింపులో దాదాపు ఐదో వంతు వాటాను కలిగి ఉన్నాయని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు.
పాప్కార్న్ రైతు విజయగాథ
ఈ కార్యక్రమం తనకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకమైందని సీపీ రాధాకృష్ణన్ తెలిపారు. రెండు నెలల క్రితం తమిళ పత్రిక ‘దినమలర్’లో పాప్కార్న్ రంగంలో పారిశ్రామికవేత్త పట్టాభి రామారావు సాధించిన విజయాల గురించి చదివినట్లు చెప్పారు.
ఒక వ్యవసాయ ఉత్పత్తిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఆయన ప్రయాణం తనను ఆకట్టుకుందని, వెంటనే పట్టాభి రామారావుకు అభినందనలు తెలుపుతూ లేఖ రాసినట్లు వివరించారు. అనంతరం పట్టాభి రామారావు తనను కలిసి పాప్కార్న్ను బహూకరించారని తెలిపారు.
ఆ తర్వాత కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్తో ఉపరాష్ట్రపతి భవన్లో సమావేశమైన సమయంలో ఆ పాప్కార్న్ను అందరికీ చూపించినట్లు రాధాకృష్ణన్ చెప్పారు. భారతీయ రైతుల్లో ఉన్న ప్రతిభ, వ్యవస్థాపక శక్తి, ప్రపంచ మార్కెట్కు అనుగుణంగా వ్యవసాయ ఉత్పత్తులను అభివృద్ధి చేసే సామర్థ్యాన్ని తెలియజేయడానికే ఈ ఉదాహరణను ప్రస్తావిస్తున్నట్లు తెలిపారు.
కొత్త విత్తన రకం ఆవిష్కరణ
కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసి నాన్-జీఎంఓ హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ హైబ్రిడ్ విత్తన రకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పలువురు రైతులను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కోర్టెవా పాప్కార్నికా ఎండీ ఎస్పీబీ పట్టాభి రామారావు తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్లు