జిల్లాకు 7 వాహనాలు.. బాలింతలు, నవజాత శిశువులకు ఉచిత రవాణా
పుట్టపర్తి, ఆగస్టు 11 (మీకోసం న్యూస్): మాతృ, శిశు మరణాల రేటును తగ్గించడంతో పాటు బాలింతలు, నవజాత శిశువులకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించే లక్ష్యంతో ప్రభుత్వం పునఃప్రారంభించిన నూతన ‘102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు శ్రీ సత్యసాయి జిల్లాలో అందుబాటులోకి వచ్చాయి. పుట్టపర్తిలోని మామిళ్లకుంట క్రాస్ సమీపంలోని కన్వెన్షన్ హాల్ ప్రాంగణంలో మంగళవారం మధ్యాహ్నం నూతన వాహనాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, అదనపు ఎస్పీ అంకిత సురన తదితరులు పాల్గొన్నారు. వారు జెండా ఊపి నూతన ‘102 తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలను ప్రారంభించారు.
ఉచిత రవాణా సౌకర్యం
ప్రసవానంతరం బాలింతలు, నవజాత శిశువులతో పాటు ఇద్దరు సహాయకులను ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి వారి ఇళ్లకు సురక్షితంగా, ఉచితంగా చేర్చేందుకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. అదేవిధంగా అధిక ప్రమాద గర్భిణులు, తీవ్ర రక్తహీనతతో బాధపడుతూ రక్తమార్పిడి అవసరమైన గర్భిణులకు ఆసుపత్రికి చేరేందుకు ఉచిత రవాణా సదుపాయం కల్పించనున్నారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం తల్లి, బిడ్డలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇంటికి చేరేలా ప్రత్యేకంగా ఈ వాహనాలను రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రభుత్వ వైద్య సేవలు పొందే తల్లులు, శిశువులకు ఈ సేవలు ఉపయోగపడనున్నాయి.
జిల్లాకు ఏడు వాహనాలు
శ్రీ సత్యసాయి జిల్లాకు మొత్తం 7 నూతన ‘తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు కేటాయించారు. వీటిలో హిందూపురం ఏరియాకు 5, కదిరి ఏరియాకు 1, ధర్మవరం ఏరియాకు 1 వాహనం కేటాయించారు. ఆయా ప్రాంతాల్లో అవసరానికి అనుగుణంగా వాహనాలను వినియోగించనున్నారు.
అత్యాధునిక సౌకర్యాలు
నూతన వాహనాల్లో బాలింతలు, శిశువుల సౌకర్యం, భద్రతకు ప్రాధాన్యం ఇచ్చారు. పూర్తి స్థాయి ఎయిర్ కండిషనింగ్ సదుపాయంతో పాటు సులభంగా వాహనంలోకి ఎక్కడానికి ఎక్స్టర్నల్ ఫుట్రెస్ట్, లోపల పట్టుకునేందుకు హ్యాండ్రైల్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. శానిటైజర్లు, టిష్యూ పేపర్లు, డస్ట్బిన్ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
వెనుక సీట్లకు సీట్ బెల్టులు, ఎయిర్బ్యాగ్లు, అగ్నిమాపక పరికరాలను ఏర్పాటు చేశారు. వాహనాల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేలా రియల్టైమ్ జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో నేరుగా 102 కాల్ సెంటర్కు సమాచారం అందేలా పానిక్, ఎమర్జెన్సీ అలారం బటన్ ఏర్పాటు చేశారు.
ఆరోగ్యంపై అవగాహన
ప్రయాణ సమయంలో బాలింతల ఆరోగ్య సంరక్షణ, శిశువుల పోషకాహారం, వ్యాధి నిరోధక టీకాల ప్రాధాన్యంపై అవగాహన కల్పించేలా ప్రత్యేక ఆడియో వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ద్వారా అవసరమైన ఆరోగ్య సూచనలు ఆటోమేటిక్గా అందించనున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్వో) డాక్టర్ ఎస్. ఫైరోజా బేగం, 102 జిల్లా కోఆర్డినేటర్ శంకర్, డీపీఎన్హెచ్వో వీరమ్మ, వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

0 కామెంట్లు