న్యాయవాది శివరామకృష్ణకు న్యాయం చేయాలని డిమాండ్
మీకోసం న్యూస్,పెనుకొండ ఆగస్ట్ 19 : హిందూపురం వన్టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని, బాధిత న్యాయవాది శివరామకృష్ణకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వివిధ దళిత, బహుజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 21న చేపట్టనున్న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయం ముట్టడి కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శుక్రవారం పెనుకొండ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో విడుదల చేశారు.
గత నెల 27న హిందూపురం మండల కేంద్రంలో న్యాయవాది శివరామకృష్ణపై హిందూపురం వన్టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు దురుసుగా వ్యవహరించారని, ఈ ఘటన జరిగి దాదాపు 24 రోజులు అవుతున్నప్పటికీ సంబంధిత అధికారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని వారు ఆరోపించారు.
బాధిత న్యాయవాదికి న్యాయం చేయడంతో పాటు ఘటనకు బాధ్యులైన అధికారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 21, 2026న శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దళిత, బహుజన, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
కరపత్రాల విడుదల కార్యక్రమంలో చైతన్య వేదిక గౌరవ అధ్యక్షుడు వెంకటేశులు, సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకుడు రామాంజనేయులు, సోమందేపల్లి మాజీ సర్పంచ్ సూర్యనారాయణ, రాంపురం రామాంజనేయులు, ఆండ్రస్ నరసింహులు, కొల్లప్ప, శివ, ఆంజనేయులు, కదిరప్ప, లక్ష్మణ్ నాయక్, ఎల్ఐసీ లక్ష్మణ్ నాయక్, పవన్ కుమార్, శశి, రాజులు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు