విజయవాడ, జూలై 11 (మీకోసం న్యూస్): రాష్ట్ర అభివృద్ధికి జనాభానే ప్రధాన బలమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ఇప్పటి వరకు అమలైన 'జనాభా నియంత్రణ' విధానానికి బదులుగా 'జనాభా సంరక్షణ' విధానాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. 'పిల్లలే సంపద' పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
"దేశమంటే మట్టి కాదోయ్... దేశమంటే మనుషులోయ్" అనే గురజాడ అప్పారావు మాటలను గుర్తు చేసిన సీఎం, భవిష్యత్ అవసరాలకు తగిన మానవ వనరులు ఉండాలంటే జనాభా పెరుగుదలపై ప్రత్యేక దృష్టి అవసరమన్నారు.
ఇద్దరు పిల్లల నిబంధనపై మార్పు సంకేతం
గతంలో జనాభా నియంత్రణలో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారిని అనర్హులుగా ప్రకటించే నిబంధనలు తీసుకొచ్చామని గుర్తు చేశారు. ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారాయని, ఆ విధానాలను కూడా సమీక్షించే అవసరం ఉందని సంకేతాలిచ్చారు.
తగ్గుతున్న జనాభాపై ఆందోళన
ప్రపంచంలోని 40కుపైగా దేశాల్లో జనాభా తగ్గుతోందని, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అంగన్వాడీలు, పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గుతుండగా, వృద్ధుల జనాభా పెరుగుతోందన్నారు. ప్రతి వంద మందిలో 89 శాతం మందికి రెండో సంతానం లేదని, విశాఖ జిల్లాలో ఫెర్టిలిటీ రేటు మరింత తక్కువగా ఉందని వివరించారు.
ఉమ్మడి కుటుంబాలే ఆదర్శం
మైక్రో కుటుంబాల కంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థే భారతీయ సంస్కృతికి బలం అని చంద్రబాబు అన్నారు. పిల్లల పెంపకం మహిళల బాధ్యత మాత్రమే కాదని, కుటుంబ సభ్యులందరి బాధ్యత అని స్పష్టం చేశారు. మహిళల ఆరోగ్య పరిరక్షణకు అవసరం లేని సిజేరియన్ కాన్పులను తగ్గించాలని సూచించారు.
సోషల్ మీడియాపై హెచ్చరిక
సోషల్ మీడియా వ్యసనం యువతలో మానసిక సమస్యలకు దారితీస్తోందని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. టెక్నాలజీతో పాటు ఆధ్యాత్మిక విలువలను అలవర్చుకుంటే యువత ప్రపంచ స్థాయిలో రాణించగలదని చెప్పారు.
వృద్ధుల కోసం 'క్షేమం'
యువత నైపుణ్యం, వృద్ధుల అనుభవం రాష్ట్రానికి విలువైన ఆస్తులని పేర్కొన్న సీఎం, వృద్ధుల సంక్షేమం కోసం త్వరలో 'క్షేమం' కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే 'తల్లికి వందనం', 'సంజీవని' వంటి పథకాలతో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని చెప్పారు.
2040 నాటికి స్వర్ణాంధ్ర, 2047 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ.55 లక్షలకు చేర్చే లక్ష్య సాధనలో జనాభా కీలక పాత్ర పోషిస్తుందని సీఎం పునరుద్ఘాటించారు. అనంతరం 'పాపులేషన్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్' పత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ రావు, వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్లు