ఆక్లాండ్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి న్యూజిలాండ్ పర్యటనలో అరుదైన గౌరవం దక్కింది. దాదాపు 40 ఏళ్ల తర్వాత ఓ భారత ప్రధాని న్యూజిలాండ్లో అధికారికంగా పర్యటించడం విశేషం. ఈ సందర్భంగా ఆక్లాండ్లోని గవర్నమెంట్ హౌస్లో మావోరీ ఆదివాసీలు తమ సంప్రదాయ 'హాకా' నృత్యంతో మోదీకి ఘన స్వాగతం పలికారు.
బలం, ఐక్యత, గౌరవానికి ప్రతీకగా భావించే హాకా నృత్యాన్ని ప్రత్యేక హావభావాలు, శక్తివంతమైన కదలికలతో ప్రదర్శించారు. అనంతరం న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టఫర్ లక్సన్ మోదీని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని స్వాగతించారు.
ఈ పర్యటనలో భారత్–న్యూజిలాండ్ సంబంధాలను 'వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్తున్నట్లు ఇరు దేశాల నాయకులు ప్రకటించారు. ఇందుకోసం 'రోడ్మ్యాప్ టు 2030' ను ఆవిష్కరించారు. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సాంకేతికత, వ్యవసాయం, విద్య, పర్యాటకం తదితర రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించేందుకు అంగీకరించారు.
ప్రజల మధ్య స్నేహబంధాన్ని బలోపేతం చేసే దిశగా భారత్–న్యూజిలాండ్ మధ్య రెండు స్నేహపూర్వక ఫుట్బాల్ మ్యాచ్ల సిరీస్ నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా, ప్రధాని మోదీకి మావోరీల హాకా నృత్యంతో స్వాగతం పలికిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
– మీకోసం న్యూస్

0 కామెంట్లు